పంట అవశేషాల దహనంపై అవగాహన:
హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ఉండాలని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంట కోతలు అనంతరం పొలాల్లలో మిగిలిపోయే అవశేషాలను తగులబెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో చైతన్యం కల్పించేందుకు మడికొండ సిఐ పుల్యాల కిషన్ ప్రత్యేక ప్రచార రథాన్ని ప్రారంభించారు.
ఈ ప్రచార రథం గ్రామాల వారీగా తిరుగుతూ పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తుంది. పొలాలలో మంటలు వేయడం వల్ల సమీప పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమయ్యే ప్రమాదం ఉందని.. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని సిఐ తెలిపారు. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి సారవంతత కూడా తగ్గిపోతుంది అని పేర్కొన్నారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా వినియోగించాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వ శాఖలు సూచిస్తున్న ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా భూమి నాణ్యత మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని తెలిపారు. గ్రామస్తులు, రైతులు ఈ కార్యక్రమానికి సహకరించాలని సిఐ పుల్యాల కిషన్ విజ్ఞప్తి చేశారు.


