వరంగల్ : చారిత్రక భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ మరియు కుడా (KUDA) అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.
మే 15వ తేదీలోపు పూడికతీత పనులన్నింటినీ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చెరువులో మొత్తం 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల మేర పూడికను తొలగించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
రానున్న వర్షాకాలం దృష్ట్యా పనుల్లో వేగం పెంచి, మిగిలిన పనిని సత్వరమే పూర్తి చేయాలని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు.


