హనుమకొండ, బాలసముద్రం:
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ రెండున్నర సంవత్సరాలు గడిపిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి అమలును పక్కనబెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు.
బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాడుతోందని స్పష్టం చేశారు. “మా పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్లా ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.
దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.
ఇటీవల టి హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినప్పుడు అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.
ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీ కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం ఎవరి సొమ్ముతో అని ప్రశ్నించారు.
అభివృద్ధి పనుల పేరుతో అవినీతి సొమ్ము కూడబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మాట మారుస్తున్న ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తాజాగా ప్రకటించారని, ఇదే ప్రభుత్వం గతంలో 2024 ఆగస్టు 21న పూర్తి చేస్తామని, మంత్రులు 2025లో పూర్తి చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.
ఒకే ప్రభుత్వం పదే పదే మాట మార్చడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
ముఖ్యమంత్రి 50 నిమిషాల పర్యటన చేసి వెళ్లిపోయారని, కనీసం సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని ఆరోపించారు.
దేవాదులపై సమీక్షలు కేవలం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిధుల కోసం చేస్తున్న చర్యలేనని అన్నారు.
దేవాదుల మూడో దశ నిర్మాణ వ్యయం రూ.17,000 కోట్ల నుంచి రూ.24,000 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.
అదనంగా పెరిగిన రూ.7,000 కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేవాదుల అంశంపై రైతుల తరఫున ఆందోళనలు చేపడతామని తెలిపారు.
కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, హరీష్ రావు పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మాటల్లో ఏకరూపత లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించి దేవాదుల ఫేజ్-1, ఫేజ్-2లను పూర్తి చేసి, ఫేజ్-3 పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు.
అయితే రెండేళ్లు దాటినా ప్రస్తుత ప్రభుత్వం దేవాదులలో గణనీయమైన పురోగతి సాధించలేదని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ముఖ్యమంత్రి గతంలో విమర్శలు చేసి, ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు జానకి రాములు, చందర్, అఫ్జల్, మట్టపెల్లి రమేష్, పులి రజినీకాంత్, నార్లగిరి రమేష్, జనార్థన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్, కోటిలింగం, వినోద్ కుమార్, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.


