సీపీ కార్యాలయానికి వెళ్లేవారికి అలర్ట్.. ఫిర్యాదుల స్వీకరణ సమయాల్లో మార్పు :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి కొత్త సమయాలను అమల్లోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై పోలీస్ కమిషనర్ ని నేరుగా కలుసుకొని తమ సమస్యలు ఫిర్యాదులు తెలియచేయాలనుకునే వారు అన్ని పని దినాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కమిషనరేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు.
అయితే కమిషనర్ ని నేరుగా ఆశ్రయించే ముందు బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా కిందిస్థాయి అధికారుల వద్ద తమ ఫిర్యాదును నమోదు చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా సందర్భాలలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కమిషనర్ ని కలవాలని సూచించారు.
ఈ విధానం ద్వారా ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సాగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి ఫిర్యాదును క్రమబద్ధంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలు అనవసరంగా ఇబ్బందులు పడకుండా నిర్ణయించిన సమయాల్లోనే కమిషనరేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని అలాగే అవసరమైన పత్రాలు ఫిర్యాదు వివరాలతో హాజరు కావాలని సూచించారు. కొత్త సమయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనరేట్ అధికారులు కోరారు.


