వరంగల్, జనవరి 27: క్రెడిట్ కార్డ్ అమౌంట్ లిమిట్ పెంచుతానని చెప్పి అమాయకులను మోసం చేస్తున్న బలోజు అఖిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఈ అరెస్ట్ను నిర్వహించింది.
బలోజు అఖిల్ గతంలో ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన కస్టమర్లను లిమిట్ పెంచుతానని నమ్మించి, వారి క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దీనిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విషయం తెలిసిన ఎస్బీఐ బ్యాంక్ అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
అయినప్పటికీ, అఖిల్ తన మోసాలను కొనసాగించాడు. తాను ఇప్పటికీ ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్గానే పనిచేస్తున్నానని చెప్పి, పాత కస్టమర్లను సంప్రదించాడు.
హనుమకొండకు చెందిన ముగ్గురు బాధితుల నుంచి సుమారు రెండు లక్షల రూపాయలు, హుస్నాబాద్కు చెందిన మరో బాధితుడి నుంచి 1,40,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుని మోసం చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, “సర్వీస్ సెంటర్లు, మీసేవ సెంటర్లు మరియు ఇతర రిటైలర్లు క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఫిజికల్గా రాకుండా, ఎవరైనా కార్డ్ పంపితే లేదా మరో వ్యక్తి తెచ్చి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఫోన్లో మాట్లాడి ఓటీపీ చెప్పి కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయరాదు.
గుర్తుతెలియని వ్యక్తులు తెచ్చిన కార్డులతో ట్రాన్సాక్షన్ చేస్తే, తదుపరి చర్యలకు బాధ్యులవుతారు” అని హెచ్చరించారు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఐ20 ఆస్టా కారు, 10,000 రూపాయల నగదు, 30,000 రూపాయల విలువైన గూగుల్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్రెడిట్ కార్డ్ సంబంధిత విషయాలను బ్యాంకుకు వెళ్లి సిబ్బందితో మాత్రమే చర్చించాలని ఇన్స్పెక్టర్ సూచించారు. మరిన్ని మోసాలు జరగకుండా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


