స్టేషన్ ఘనపూర్, జనవరి 30 (న్యూస్): ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బేదాభిప్రాయాలు పక్కనపెట్టి, అందరూ కలిసికట్టుగా పనిచేసి 18 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఘనపూర్ మున్సిపాలిటీ నాయకులు, ఆశావహులు, వార్డు ఇంచార్జ్లతో జరిగిన సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ బలాన్ని చూపించాలని, చిన్నచిన్న బేదాభిప్రాయాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని కోరారు.

అందరికీ ఒకేసారి అవకాశాలు రావని, ప్రజాధారణ ఉన్నవారికి, గెలిచే అవకాశం ఉన్నవారికే పార్టీ టికెట్ ఇస్తుందని, ఆ నిర్ణయం పక్కా సర్వేల ఆధారంగా పిసిసి తీసుకుంటుందని వివరించారు.
అవకాశం రాని వారు నిరుత్సాహపడవద్దని, కష్టపడే కార్యకర్తలను పార్టీ ఎల్లవేళలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే రూ.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కాంగ్రెస్ గెలిస్తే మరో రూ.50 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత తమది, ఎమ్మెల్యే శ్రీహరిది అని హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష నాయకులు ఎలాగైనా ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, ఆశావహులు, వివిధ మండలాల నుంచి వచ్చిన వార్డు ఇంచార్జ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


