“హమ్మయ్య..! ఇక ఆ బాధ లేదు.. ఐపీఎల్లో ఆ రూల్కు శాశ్వతంగా ఎండ్ కార్డ్..:
ఐపీఎల్ అభిమానులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని సీజన్లుగా అమలులో ఉన్న “ఇంపాక్ట్ ప్లేయర్” నిబంధనను తొలగించే దిశగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆలోచనలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈ నిబంధన అమలులోకి వచ్చినప్పటి నుంచి అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలువురు స్టార్ ఆటగాళ్లు విమర్శలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా మ్యాచ్ లలో వ్యూహాత్మక మార్పులు పెరిగినా.. అసలైన క్రికెట్ సమతుల్యత దెబ్బతింటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆల్రౌండర్ల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. జట్ల ఎంపికలో సహజ సమీకరణాలు దెబ్బతింటున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. భారత దిగ్గజ సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఈ నిబంధన పై సందేహాలు వ్యక్తం చేశారు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ అనంతరం ఈ అంశంపై బీసీసీఐ తీవ్రస్థాయిలో చర్చలు వేగం పుంజుకున్నట్లు సమాచారం. క్రికెట్ ను మరింత సహజంగా పోటీ తత్వంతో కొనసాగించాలని ఉద్దేశంతో ఈ రూల్ ని పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ “ఇంపాక్ట్ ప్లేయర్” నిబంధన భవిష్యత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.


