మహిళా సంఘాలకు సౌరశక్తితో ఆదాయం.. అశ్వరావుపల్లిలో మెగా సోలార్ ప్లాంట్కు శ్రీకారం :
మహిళలను ఆర్థికంగా పారిశ్రామికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వర రావుపల్లి గ్రామంలో జిల్లా మహిళా సమాఖ్య, మండల మహిళా సమఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

సుమారు రెండు కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మించునున్న ఈ సోలార్ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్టు 20 సంవత్సరాల పాటు పని చేసే సామర్థ్యం కలిగి ఉండగా.. జిల్లా మరియు మండల మహిళా సమఖ్యలకు నెలకు సుమారు నాలుగు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు.. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహిళలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తుందని పేర్కొన్నారు. మహిళల పేరుతో రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇల్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా జనగామ జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల స్థాయిలో విత్తనాలు ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసే వినూత్న కార్యక్రమానికి త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.


