పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదల.. 92.89% ఉత్తీర్ణత, అమ్మాయిలదే ఆధిక్యం :
రాష్ట్రంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)-2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 92.89 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.30గా ఉండగా, అబ్బాయిలది 91 శాతంగా నమోదైంది.
మే 29 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 23,637 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 21,958 మంది అర్హత సాధించారు. పరీక్షలు ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించడం విశేషమని బాలకిష్టారెడ్డి పేర్కొంటూ, ఇందుకు కృషి చేసిన సెట్ నిర్వాహకులను అభినందించారు.
సబ్జెక్టువారీగా పరిశీలిస్తే, మొత్తం 19 సబ్జెక్టుల్లో ఏడు సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రధాన విభాగమైన కంప్యూటర్ సైన్స్లో 91.43 శాతం మంది, ఫార్మసీ విభాగంలో 97.48 శాతం మంది అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చే సబ్జెక్టులకు పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొన్ని విభాగాల్లో అభ్యర్థుల సంఖ్య కంటే ఎంటెక్ సీట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించారు.
ఎప్సెట్ కౌన్సెలింగ్ వాయిదా :
ఇక ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని బాలకిష్టారెడ్డి తెలిపారు. ఎంబైపీసీ విద్యార్థులు నీట్ పరీక్షలో పాల్గొంటుండటంతో, వారికి ఇబ్బందులు తలెత్తకుండా కౌన్సెలింగ్ షెడ్యూల్ను రూపొందించనున్నట్లు చెప్పారు. మరోవైపు జేఎన్టీయూ పరిధిలోని 136 ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన తనిఖీల్లో 80 కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉన్నట్లు గుర్తించామని, లోపాల సవరణకు యాజమాన్యాలకు గడువు ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.


