వరంగల్: జిల్లాలోని వరంగల్-2 డిపోలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. డిపోలో నిలిపి ఉంచిన ఒక ఎలక్ట్రిక్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఆదివారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం పూర్తిగా కాలిపోయినప్పటికి ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


