హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ, ప్రతిపక్ష నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు సుమారు రూ. 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని నాయిని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై వాస్తవాలు బయటకు రావాలంటే CBI లేదా CID తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“నేను చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తాను” అని నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్కు పంపిస్తున్నట్లు తెలుపుతూ.. ఇదే దమ్ము కేటీఆర్, హరీష్ రావులకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.
హన్మకొండలో నిబంధనలకు విరుద్ధంగా పార్క్ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, దీనిపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడటం “దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది” అని ఆయన ఎద్దేవా చేశారు.


